ఆకలికి రంగులేదు…(కథ)

 

                                                                    ఆకలికి రంగులేదు                                                                                                                                                (కథ)

జాతి! ఆ పదం మీకు దేనిని జ్ఞప్తికి తెస్తుంది? కొందరికైతే ఇది ద్వేషం, అణచివేత అనే భావాన్నిస్తుంది. ఇతరులకైతే, ఇది అసూయ, కలహం, మరియు హత్య కూడా అని భావమైయుంది.

అమెరికాలోని జాతి కలహాలతో మొదలుకొని దక్షిణాఫ్రికాలోని వర్ణవివతల వరకు, తూర్పు ఐరోపాలోని వేర్వేరు తెగల మధ్య యుద్ధాలు మొదలుకొని పాకిస్తాన్‌, శ్రీలంక లాంటి దేశాల్లోని పోరాటాల వరకుజాతి అనేది మానవుని దారుణ బాధకు, విధ్వంసకాండకు కేంద్రస్థానమైంది.

అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది? దాదాపు ప్రతీ విషయాన్ని కూడ సహించేలా కన్పించే ప్రజలున్న దేశాల్లో కూడ, జాతి అనేది ఎందుకంత విపరీత వివాదాంశమైంది? ఎంతో గందరగోళాన్ని,అన్యాయాన్ని రగిలించే ఒత్తిలా జాతిని తయారుచేసిందేమిటి? సరళంగా చెబితే, వేర్వేరు జాతుల ప్రజలు ఎందుకు కలిసిమెలసి జీవించలేరు?

"ఎవరయ్యా నాకు ఉద్యోగం ఇచ్చేది? ఎక్కడకెళ్ళి అడిగినా నీ జాతి, నీ కులం ఏమిటని అడుగుతున్నారు. చెప్పిన వెంటనే ఉద్యోగం లేదని వెళ్లగొడుతున్నారు. కాళ్ళకు వేసుకున్న చెప్పులకు కూడా మర్యాద ఇస్తూ బద్రపరచి ఉంచుకుంటున్నారు. మనకి ఆ మర్యాద కూడా లేదు. చివరికి ఈ పనైనా దొరికిందని సంతోషపడి ఉంటున్నా...కానీ ఈ ఉద్యోగానికి కూడా ఏసరు వచ్చింది"

***************************************************************************************************

మురళికి, శ్మశానానికి వెళ్ళే ఆ అడ్డదారే, అతను కళాశాలకు వెళ్ళి రావటానికి ఈజీగా అమరింది. అతనితో పాటూ చదువుకునే పిల్లలందరూ వాళ్ళ స్టేటస్ కు తగినట్టు బైకులలోనూ, బస్సులలోనూ వెళ్ళ, మురళికి సైకిల్ గురించి తలుచుకోవాలన్నా పెద్ద కలగానే ఉంటుంది.

అతను వివరాలు తెలుసుకోగలిగే రోజు నుండి, తల్లి రోగిష్టిగానే ఉన్నది.

రెండేళ్ళ వయసు ఉన్నప్పుడే తండ్రి చనిపోయారట. అమ్మ ఉంటున్న సొంత ఇంటిని అమ్మేసి, అద్దె ఇంటికి కాపురానికి వెళ్ళి -- అడవి పనులకు పోయి -- ఆమె కడుపుతో పాటూ పిల్లాడి కడుపునూ నింపుతూ ఉన్నది.

'ఎలాగైనా పిల్లాడ్ని చదివిస్తే తన శ్రమ అంతా తీరిపోతుంది' అని అనుకుని మనసులో పట్టుదలతో చదివించింది.

తల్లి ప్రొద్దున్నే పనికి వెళ్ళిపోతుంది కాబట్టి, ఊరి వీధి పంపు దగ్గర క్యూలో నిలబడి మంచి నీళ్ళు పట్టుకోవటం నుండి -- కుంపటి వెలిగించుకోవటానికి కట్టె పుల్లలు ఏరుకుని రావటం -- కోళ్ళకు ఆహారం వేయటం అంటూ అన్ని ఇంటి  పనులు అతనే చేయటం వలన,మామూలు రోడ్డు ద్వారా నడిచి కళాశాలకు వెళ్ళాలనుకుంటే, కాలేజీకి వెళ్ళి చేరటానికి మధ్యాహ్నం అవుతుంది. అందువలన శ్మశానాన్ని ఆనుకుని వెళ్ళే అడ్డదారి బాటను ఎన్నుకున్నాడు. ఆ దారిలో వెళితేనే అతను టైముకు కాలేజీకి జేరుకోగలడు.

మొట్టమొదట శవం కాలుతున్న వాసన వలన అతనికి కడుపులో తిప్పేది. దాంతో పాటూ మనసు కూడా భయంతో ఉండటం వలన గుండె దఢతో వేగంగా కొట్టుకునేది.

కాలుతున్న శవాన్ని కర్రతో తిప్పుతూనే దాని దగ్గరే నిలబడ్డ గురువయ్యను చూస్తున్నప్పుడు, అతనికి ఆశ్చర్యంగా ఉన్నది. ఇతను ఎలా ఈ శవం కాలే వాసనతో దాని దగ్గరే ఉంటున్నాడు? ఎలా తింటున్నాడు? దాంతోపాటూ, రాత్రిపూట స్మశానంలోనే కాపురం ఉండటాన్ని తలుచుకుంటే భయం భయంగా ఉండేది.

కాలేజీలో స్పేషల్ క్లాసులు పెట్టినప్పుడంతా టైమైపోతుంది. చీకటి పడి నలుపు కమ్ముకున్న దారిలో వెళుతూ స్మశానాన్ని దాటుతున్నప్పుడు చెమెటలు పడతాయి.

ఆ దారిలో వెళ్ళి అలవాటు పడినందువలన "ఏయ్...గురువా...గురువా" అని పిలుస్తాడు.

"ఎందుకయ్యా ఇంత ఆందోళన పడతావు?" అని అడుగుతూ గురువయ్య సావకాశంగా రావడంతో, "త్వరగా రా -- నాకు భయంగా ఉంది" అని కళ్ళు మూసుకుని నిలబడతాడు.

"ఇంతగా భయపడుతున్నప్పుడు చీకటి పడిన తరువాత ఎందుకు ఈ దారిలో వస్తావు?" అని అడుగుతూనే గురువయ్య, అతని చేయి పుచ్చుకున్నప్పుడే మనసులో ఉన్న భయం కొంచంగా తగ్గుతుంది.

"ఏం గురువయ్యా...పోయి, పోయి ఎందుకయ్యా ఈ పనికి వచ్చావు. నీకు భయంగా లేదా?"

"భయంగానే ఉండేది. కానీ కడుపు ఉంది కదా. ఆ కడుపులో ఆకలి ఉంది కదా అబ్బాయ్"

"అందుకని దేశంలో ఎన్నో పనులు ఉన్నాయే. వాటన్నింటిలో ఏదో ఓక దానికి వెళ్ళక, ఎందుకు ఈ పనికి వచ్చావు?"

"ఎవరయ్యా నాకు ఉద్యోగం ఇచ్చేది? ఎక్కడకెళ్ళి అడిగినా నీ జాతి, నీ కులం ఏమిటని అడుగుతున్నారు. చెప్పిన వెంటనే ఉద్యోగం లేదని వెళ్లగొడుతున్నారు. కాళ్ళకు వేసుకున్న చెప్పులకు కూడా మర్యాద ఇస్తూ బద్రపరచి ఉంచుకుంటున్నారు. మనకి ఆ మర్యాద కూడా లేదు. చివరికి ఈ పనైనా దొరికిందని సంతోష పడి ఉంటున్నా...కానీ ఈ ఉద్యోగానికి కూడా ఏసరు వచ్చింది"

"ఏం...ఇప్పుడేమైంది?"

"నాకిప్పుడు వయసు అరవై ఏళ్ళు అయ్యిందట. ఇక ఈ పనిలో ఉండటానికి నేను పనికిరానట!"

"నీకు జీతం ఎంత ఇస్తున్నారు?"

"రెండువేల రూపాయలు. అదీ కాకుండా శవం మీద ఉండే డబ్బూ, నగా నట్రా లాంటివి. ఇష్టపడిన వారు దయతలిచి ఐదువందలో, వెయ్యో ఇస్తారు" అంటూ గురువయ్య చెప్పుకుంటూ ఉంటే, మురళికి వినటానికే కంపరం పుట్టింది.

"సరి...సరి. ఇకమీదట దాని గురించి మాట్లాడకు. నాకు పరీక్షలు పూర్తి అయినై. తొందరలోనే ఉద్యోగం దొరుకుతుంది. నేనే నీకు ఉద్యోగం ఇప్పిస్తాను"

"దానికి కాదబ్బాయ్. వారసుడు ఉంటే నా ఉద్యోగం వాడికి ఇస్తారట. నాకు వారసుడు లేడే అని ఇప్పుడు బాధపడుతున్నాను"

"అవును...ఇదొక గొప్ప ఆఫీసర్ ఉద్యోగం? దీనికొసం అంత బాధపడుతున్నావు?" అన్నాడు మురళి.

"అది కాదబ్బాయ్...నాకు ఇంకో పని దొరికేంతవరకు, ఈ కడుపు ఊరుకోదయ్యా! ఆకలి, ఆకలి అని ఏడుస్తుంది"

దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక తలవంచుకుని వెళ్ళిపోయాడు మురళి.

అతనికి పరీక్ష రిజల్స్ వచ్చినై. క్లాసులోనే మూడో ర్యాంకు తెచ్చుకున్నాడు. ఆనందంతో సీతాకోక చిలుకులా ఎగిరింది మనసు. ఇంటికి వచ్చి అమ్మతో చెప్పినప్పుడు, ఆమె అతనిలాగా ఆనందపడలేకపోయింది. రోగంతో వాడిపోయిన ఆమె ముఖంలో, చిన్నగా కాంతి వచ్చింది. అంతే!.

ఆ తరువాత సరదాగా ఒక సంవత్సరం గడిచిపోయింది. అతని తల్లి మామూలుగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళే పేదరికం, ఇప్పుడు ఇంట్లో బాసిపీట  వేసుకుని కూర్చుంది.

హోటలు,షాపు,కంపెనీ అంటూ వీధి వీధీ తిరిగాడు. పనికావాలని అడుగుతూ.

అతనికి అనుభవం లేదనే కారణం చెప్పి, ఉద్యోగం ఇవ్వటానికి కుదరదని చెప్పారు. అప్పుడప్పుడు కాఫీ కొనుక్కుని తాగి, ఆకలిని చంపుకోవటానికి ప్రయత్నించాడు. కానీ, అతని తల్లి--ఆకలితో మాట్లాడటానికే శక్తి లేనిదిగా అయ్యింది.

కన్న తల్లిని చూస్తున్నప్పుడు, ఇతనికి హృదయం కృంగిపోయింది.

ఆ రోజు చీకటి పడి చాలాసేపు అయిన తరువాత అతను వచ్చినప్పుడు, గురువయ్యకు ఆశ్చర్యం వేసింది.

"ఏంటబ్బాయ్! ఈ టైముకు నన్ను వెతుక్కుంటూ వచ్చావు? నాకెవరన్నా పని ఇస్తారని చెప్పారా?"

"లేదు గురువయ్యా, నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని నాకు ఇప్పించమని అడగటానికి వచ్చాను...కాదనకుండా ఇప్పించు"

"ఏంటయ్యా చెబుతున్నావు?"

"అవును గురువయ్యా! చదువు ముగిసి ఒక సంవత్సరం అయ్యింది. నాకింకా ఉద్యోగం దొరకలేదు. నేనూ అడగని చోటు లేదు"

"ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేసి చూడచ్చు కదా?"

"నేను వెయిట్ చేస్తాను. మా అమ్మ పస్తులు పడుకోవటం నేను చూడలేకపోతున్నాను. నాకు తోడుగా ఉండే జీవి ఆమె ఒకత్తే. ఆమెనూ పోగొట్టుకుంటానేమోనని భయంగా ఉంది"

"నా వారసుడికే ఉద్యోగం ఇస్తామని చెప్పారు. మీకు ఉద్యోగం అడిగితే -- 'ఇతను ఎవరు...? ఇతనికెందుకు నీ ఉద్యోగం అడుగుతున్నావు? అంటూ వెయ్యి ప్రశ్నలు వస్తాయే?"

"దానికి సమాధానం ఉంది. నన్ను నీ వారసుడని చెప్పేయి" అని మురళి చెప్ప, శరీరంపై కత్తిపోటు పడినట్టు తల్లడిల్లి పోయాడు గురువయ్య.

"స్వామీ అలా చెప్పకండి. నేను తక్కువ జాతి...మీరు గొప్ప జాతి" అంటూ అతను చెప్పి ముగించటానికి ముందే,

"ఆకలికి ముందు నాకు జాతులు కనబడటం లేదు గురువయ్యా" అంటూ అతని ముందు మోకాళ్ళ మీద కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్న మురళిని చూసి చాలాసేపు షాకులో ఉండిపోయాడు గురువయ్య.

**************************************************సమాప్తం*****************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మంచిదొక ఐడియా...(కథ)

ఏల్నాటి శని...(కథ)

పువ్వులో ఒక తుఫాన...(కథ)