ఆశ్రమం...(కథ)

 

                                                                         ఆశ్రమం                                                                                                                                                                        (కథ)

"ఎవరి కష్టాలకు కారణం వారే. కన్న వారిని గౌరవించక పోవటం, వాళ్ళను ఇంటి నుండి పంపించేయటం చేస్తే దేవుడు శిక్ష వేస్తాడు అనేది గ్రహించాలి. ఒక్కొక్కరికీ ఒక్కో రకం శిక్ష వేస్తాడు. దానినుండి ఎవరూ తప్పించుకోలేరు"--స్నేహితురాలు ఒక రోజు చెప్పింది జ్ఞాపకమొచ్చింది రంజితకు. కోట్లకొలది ఆస్తి ఉండి అనాధ జీవితం గడుపుతోంది రంజిత.

రంజిత స్థితికి రావాటానికి కారణం ఏమిటంటే ఆమె తన కన్న వారిని గౌరవించక పోవటమే. దేవుడు ఆమెకూ శిక్ష వేసాడు. ఏమిటా శిక్ష? కథ చదివితే మీకే అర్ధమవుతుంది. 

*****************************************************************************************************

జానకి-రామచంద్ర వృద్దుల అనాధ ఆశ్రమం రోజు తెల్లవారు జామున ఐదు గంటలకు ముందే మేల్కొన్నది. తమ వృద్ద వయసును కూడా లెక్క చేయకుండా ఆశ్రమంలోని ప్రతి ఒక్కరూ ఆశ్రమాన్ని అలంకరిస్తున్నారు.

ఎవరికోసం కోలాహలం?

అంతా ఆశ్రమ యజమాని రంజిత కోసమే!

రోజు అమె పుట్టిన రోజు. విషయం ఆశ్రమంలోని అనాధ వృద్దులకు అంతకు రెండు రోజుల ముందే తెలిసింది. ఆశ్రమం తెరిచి పదిహేను సంవత్సరాలలో ఆమె తన పుట్టిన రోజును ఎప్పుడూ జరుపుకున్నది లేదు. ఎవరితోనూ చెప్పనూ లేదు.

ఆమె పుట్టిన రోజు గురించి తెలుసుకున్న తరువాత, ఆశ్రమంలోని వృద్దులు యజమాని పుట్టిన రోజును గొప్పగా జరపాలని నిశ్చయించు కున్నారు. అందుకే కోలాహలం, హడావిడి.

నలభై ఐదు సంవత్సరాల వయసే అవుతున్న రంజిత, పెళ్ళి చేసుకోకుండా, తన జీవిత కాలాన్ని అనాధల క్షేమం కోసమే ఖర్చు పెడుతూ వస్తోంది. తన ఆస్తులన్నిటినీ ఆశ్రమానికి ఆధారపడేటట్టు చేసి, సేవను చేస్తూ వస్తోంది.

ఆశ్రమానికి వచ్చిన ఆమెకు అక్కడున్న వాళ్ళందరూ కలిసి, ఒకటిగా చేరి, పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి, బహుమతులు ఇవ్వటంతో నోట మాట రాక ఆశ్చర్యపోయింది రంజిత.      

అదే సమయం ఇది అనవసరమైన ఖర్చు!అని గొణుక్కుంటూ, “నేను బహుమతలకు అర్హురాలు కాను అని చెప్పి ఏడ్చేసింది.

అందరూ ఆశ్చర్యపోయారు. కోలాహలంగా ఉన్న చోటు ఒక్కసారిగా నిశ్శబ్ధమండలం అయ్యింది.

నేను...నేను...ఒక పాపాత్మురాలుని...--స్వరంలో వణుకుతో చెప్పింది.

అలా మాట్లాడకండి...మీరు ఇక్కడున్న మా అందరికి తల్లి లాంటి వారు

లేదు! తల్లి-తండ్రుల ప్రేమాభిమానాలను గౌరవించని పాపిని నేను... తల బాదుకుంది.

"లేదమ్మా మీరు చేతులెత్తి నమస్కరించ బడవలసిన ఒక దేవత. ఎంత మంది ఆనాధల కడుపులు నింపుతూ, తల దాచుకోవటానికి ఆశ్రయమిచ్చి ఆదుకుంటున్నారు. మీరు పోయి మిమ్మల్ని 'పాపిని ' అని ఏదేదో ఒకటి అనుకుని మిమ్మల్ని మీరే కించపరుచుకుంటూ బాధపడుతున్నారు"  అంటూ వయసు ముదిరిన ఒక వృద్దురాలు చెప్పింది.

"లేదమ్మా...నా కథ వింటే మీరందరూ నన్ను అసహ్యించుకుంటారు. ఈవిడ్నా మనం ఆశ్రయించింది? ఈవిడ దగ్గరా మనం తల దాచుకున్నది? ఈవిడ పెట్టిన భోజనమా మనం తింటున్నది? అని మీరే నన్ను అసహ్యించుకుంటారు….అలాంటి దరిద్రపు పని నేను చేశాను"

                                                                                   ****************

రంజిత యొక్క తల్లి-తండ్రులైన జానకీ -- రామచంద్ర ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్న వారు. వాళ్ళ ప్రేమను వాళ్ళ తల్లి-తండ్రులు అంగీకరించలేదు. వాళ్ళను ఇంట్లోకి చేర్చలేదు. వాళ్లను వెలివేసినట్లు దూరంగా ఉంచారు. బంధువులు కూడా జానకీ -- రామచంద్ర  లను ఆదరించలేదు. అందరూ వెలివేయటంతో వాళ్ళు ఒంటరి వాళ్ళు అయారు. పిల్లలు పుడితే వాళ్ళే మిమ్మల్ని ఆదరిస్తారులే అని స్నేహితులు సలహా ఇచ్చి తప్పుకున్నారు.

వాళ్ళకు రంజిత కాకుండా ముకుంద్ అనే వికలాంగ మగపిల్లాడు కూడా పుట్టాడు.

స్నేహితులు చెప్పినట్లే మనవరాలు రంజిత యొక్క అందం చూసి కూతుర్ని మన్నించి, ఆమెనూ, ఆమె భర్తనూ, మనవుడ్నీ తమ దగ్గరే ఉంచుకోవటానికి అంగీకారం తెలిపారు ఆస్తిపరులైన జానకి యొక్క తల్లి-తండ్రులు.

కాలం గడుస్తున్న కొద్దీ, రంజిత తప్ప మిగిలిన ముగ్గురూ జానకి తల్లి-తండ్రుల చేతే అవమాన పరచబడ్డారు. తన తాతయ్యా-అమ్ముమలనే అమ్మా-నాన్న అని పిలుస్తూ వచ్చిన రంజిత మొండి పిల్లగా పెరిగింది. తాతయ్య-అమ్ముమ్మల తో పాటూ కలిసి తల్లి-తండ్రులను, తమ్ముడ్నీ వేలాకోలం చేయటమే కాకుండా హీనంగా చూసేది. 

వయసైన వారు కాబట్టీ ఒకరి తరువాత తరువాత ఒకరు అమ్ముమ్మా-తాతయ్యలు ప్రపంచం నుండి సెలవు తీసుకున్నారు....ఆస్తి మొత్తం వీలునామా ప్రకారం రంజిత పేరుకు వచ్చేసింది.

తరువాత రంజిత తన కన్నవారి మీద, తమ్ముడి మీద ఆమె పెట్టే బాధలు ఎక్కువైనై. కూతురు పెట్టే బాధలను భరించలేక ఒక రోజు ముగ్గురూ ఎవరికీ కనిపించకుండా  కనిపించనంత దూరం వెళ్ళిపోయేరు. రంజిత కూడా "హమ్మయ్యా" అనుకుని ఆనందించింది.

తరువాత రెండు సంవత్సరాలు...ఆమె ఆటలాడి టయర్డ్ అయిపోయింది.

రంజిత ఆస్తితో పాటూ రంజిత ఒంటరిగా ఉండటం తెలుసుకున్న ఆమె దగ్గరి బంధువులు ఆమెను చుట్టు ముట్టారు. ఆమె ఆస్తికోసం ఆమెను పీక్కు తిన్నారు. మా వాడిని పెళ్ళి చేసుకో మని ప్రతి ఒక్కరూ ఆమె పై ఒత్తిడి తెచ్చారు. కాదన్నందుకు ఆమెను చంపడానికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న రంజిత ఒక చోటి నుండి మరో చోటికి పరిగెత్తింది. ప్రశాంతత కోల్పోయింది. ఆమెను ఓదార్చి, మేమున్నామని ఆదరణ తెలిపేవారు పూర్తిగా కరువయ్యారు. ఒకళ్ళో, ఇద్దరో అలా ఆదరణ తెలిపి ఆమెకు దగ్గరైన వారు, ఆస్తికోసమే అలా దగ్గరయ్యారని తెలుసుకుంది.

అక్కడ్నుంచి పరిగెత్తింది, పరిగెత్తుతూనే ఉన్నది, జీవితం అంచులలోకి పరిగెత్తింది. ఇక పరిగెత్తే ఓపిక లేక ఒక సముద్ర తీరంలో కూర్చుంది....తనకోసం ఎవరూ లేరనే బాధతో ఏడ్చింది, ఏడుస్తూనే ఉంది...అప్పుడు తనకోసం మేమున్నాం అంటున్నట్టు ఆమె తల్లి-తండ్రులు, వికలాంగుడైన కొడుకును తీసుకుని తమ ఆకలి బాధకోసం అందరి దగ్గర అడుక్కోవటం కనబడింది.

రోజుకు వెయ్యి మందికి తమ జన్మాంతరం అన్నదానం చేసేంత ఆస్తి ఉన్న వాళ్ళు ఒక పూట కడుపు నింపుకోవటానికి ఇలా అడుకుంటున్నారు. దీనికి ఎవరు కారణం. నేనేఅన్న బావన రాగానే అమ్మా-నాన్నా' అని అరుచుకుంటూ వాళ్ల వైపుకు పరిగెత్తింది. కానీ వాళ్ళు కనబడలేదు. వాళ్ళ కోసం వెతికింది. కనబడలేదు. అప్పుడు ఆమెకు కన్నవారి అవసరం ఆమెకు తెలియటం మొదలైయ్యింది. తన తప్పులను తెలుసుకుని మారింది. కన్నవారిని, తమ్ముడ్నీ చూడటానికి తపించిపోయి వీధి, వీధిగా తిరిగింది. ఎక్కడా వాళ్ళు కనబడలేదు.

అప్పుడనిపించింది రంజితకు, తన కష్టాలకు కారణం తానేనని. తన కన్న వారిని తాను గౌరవించక పోవటం వలన, వాళ్ళను ఇంటి నుండి పంపించేసినందుకు దేవుడు వేసిన శక్ష ఇది అని గ్రహించిందిఎంత వెతికినా తన తల్లి-తండ్రులు కనిపించ నందువలన  ఒక తీర్మానానికి వచ్చింది. తీర్మానం ఆమెలో ఎనలేని ధైర్యాన్ని నింపింది. తన ఇంటికి వెళ్ళింది. బంధువులందరినీ ధైర్యంగా ఇంట్లో నుండి తరిమింది.

ఒక డిటెక్టివ్ ఏజెన్సీ ని ఏర్పాటు చేసి తన తల్లి-తండ్రులను వెతికే బాధ్యత అప్పగించింది.

రెండు సంవత్సరాలైనా తల్లి-తండ్రుల ఆచూకీ తెలియకపోవటంతో....

తల్లి-తండ్రి పేరుతో అనాధ వృద్దాశ్రమం నిర్మించి, అనాధలుగా ఉంటున్న వృద్దులను చేరదీసి, వాళ్ళకు ఆశ్రయం కల్పించి సేవలు చేయటం మొదలు పెట్టింది. రోజైనా తన తల్లి-తండ్రులు తమ పేరుతో ఉన్న వృద్దాశ్రమ్మాన్ని వెతుక్కుంటూ తన దగ్గరకు వస్తారనే ఆశతో.

కానీ ఆశ్రమం ప్రారంభించి ఐదు  సంవత్సరాలైనా వాళ్ళు రాలేదు బాధతో తనిని తాను శిక్షించుకుంది రంజిత. పెళ్ళి చేసుకోకుండా తన-తల్లి తండ్రులు కోసం కాచుకుంది. ఇరవై సంవత్సరాలైనా వాళ్ళు రాలేదు.

కల్లు తుడుచుకుంది రంజిత.

ఇదే రంజిత యొక్క ఫ్లాష్ బ్యాక్!

ఆశ్రమాన్ని కూడా ఒక స్వార్ధం కోసమే ప్రారంభించాను. ఏరోజైనా నా వలన  తరిమివేయబడ్డ కన్నవారు ఆశ్రమానికి ఆశ్రయం కోసం వెతుక్కుని రారా...వాళ్ళను చూడకపోతామా అనే ఆశే కారణం. ఇప్పుడు చెప్పండి...మీ అందరి ప్రేమలకూ నేను అర్హురాలునా?”

కళ్ళల్లో కన్నీటి జలపాతం పొంగింది.

మారిన మీ మనసు కోసం, ఆదాయం ఎదురు చూడకుండా సేవ చేయాలనే మీ గుణానికి, మీ కుటుంబీకులను ఖచ్చితంగా ఒక రోజు కలుస్తారు!

వయసు ముదిరిన ఒకావిడ ఆశీర్వదించగా...ఆశ్రమమే రంజితకు పుట్టిన రోజు శుభాకాంక్షలు పాడారు.

వాళ్ళనే తన తల్లి-తండ్రులుగా భావించి వారి ఆశీర్వాదాలనూ, పుట్టిన రోజు శుభాకాంక్షలను తలవంచి అందుకుంది రంజిత. అయినా ఆమె చూపు వాకిలివైపే ఉన్నది.

*****************************************************************************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చిలుకల గుంపు...(కథ)

ఉమ్మడి కుటుంబం…(మినీ కథ)

ఏల్నాటి శని...(కథ)