ముఖా ముఖి...(కథ)

 

                                                                                ముఖా ముఖి                                                                                                                                                                     (కథ)

ముఖా ముఖి ఇంటర్ వ్యూ కు నాలుగవ క్యాండిడేట్ గా వచ్చిన అభ్యర్ధిని చూసిన వెంటనే యూ ఆర్ సెలెక్టడ్ అండ్ అప్పాయింటడ్ అని చెప్పాడు ఎం.డి. ప్రవీణ్ కుమార్.

ప్రశ్నలేమీ అడగకుండా ఉద్యోగమా?.... మనసులోనే అనుకున్న విక్రమ్, నోట మాట రాక ఆశ్చర్యపోయి నిలబడ్డాడు.

మిస్టర్. విక్రమ్.... మీరు ఏమాలొచిస్తున్నారో అర్ధమయ్యింది. ఫైలు చూడకుండా, ప్రశ్నలేమీ అడగకుండా, నీ అర్హతలేమిటో తెలుసుకోకుండా నీకు ఉద్యోగం ఇస్తున్నందుకు ఆశ్చర్యపోతున్నావు కదూదానికి కారణం నిన్ను రెకమండ్ చేసింది ముఖా ముఖి బగవంతుడే కనుక. రెపే ఉద్యోగంలో జాయిన్ అయిపో... అంటూ చెయ్యి చాపి షేక్ హ్యండ్ ఇస్తూ చెప్పాడు కంపెనీ ఎం.డి. ప్రవీణ్ కుమార్.

ఎం.డి ప్రవీణ్ కుమార్ కి రెకమండేషన్ అంటే ఇష్టం లేదు. రెకమండేషన్ పుచ్చుకుని ఎవరు తన కంపెనీ ఇంటర్ వ్యూ కి వచ్చినా వాళ్ళని ఉద్యోగంలోకి తీసుకోడు.

కానీ విక్రమ్ విషయంలో అలా చేయలేకపోయాడు. కారణం రెకమండేషన్ చేసింది భగవంతుడేనని అభిప్రాయపడ్డాడు ఎం.డి ప్రవీణ్ కుమార్.

భగవంతుడేమిటి?...ఉద్యోగానికి రెకమండ్ చేయడమేమిటి?!...అని అనుకుంటున్నారు కదూ. నిజమే సుమా.

అదేమిటో తెలుసుకోవాలంటే ఆరు గంటల క్రితం ఎం.డి ప్రవీణ్ కుమార్ కు ఏం జరిగిందో తెలుసుకోవాలి.

                                                                    ***********************************

ప్రొద్దున ఆరుగంటలకే గుడికి వెళ్ళిన ప్రవీణ్ కుమార్ తల్లి , ఎనిమిదైనా ఇంటికి రాలేదు.

రోజూ అదే టైముకు గుడికి వెళ్ళటం ఆమెకు అలవాటు. గుడి పెద్ద దూరంలో ఏమీ లేదు. నడిచి వెల్తే పావు గంట. కార్లో వెల్తే ఐదు నిమిషాలు. ఒకటికి రెండు కార్లున్నా ఆమె నడిచే వెడుతుంది. గుడిలో పావుగంట గడిపి, పావు గంటలో మళ్ళీ ఇంటికి చేరుకుంటుంది. ఏది ఏమైనా ఒక గంటలొ, అంటే ఏడుగంటల లోపే ఆమె ఇంటికి తిరిగి వస్తుంది.

కానీ రోజు సమయం ఎనిమిది దాటుతున్నా అమె ఇంటికి తిరిగి రాలేదు .

ప్రవీణ్ కుమార్ కి కంగారు మొదలైయ్యింది.

ఇంకో పావుగంట చూద్దాం అన్నది భార్య.

భార్య చెప్పిన టైము కూడా దాటింది.

ఇక ఉండబట్టలేక భార్యను చూసి నేను గుడి వరకు వెళ్ళి చూసొస్తాను అని చెప్పి కారు తీసుకుని గుడికి బయలుదేరాడు ప్రవీణ్ కుమార్.

నారాయణమ్మగారు పూజ ముగించుకుని అప్పుడే వెళ్ళిపోయిందే 

అలవాటుపడ్డ పూజారి చెప్పటంతో ప్రవీణ్ కుమార్ కు గాబరా ఎక్కువైంది.

గుడి మొత్తం ఒకసారి వెతికాడు. విపరీతమైన ఆలొచన రావడంతో గుడి లో ఉన్న కొలను చుట్టుతా కూడా వెతికాడు.

తెలిసినవాళ్ళందరి ఇళ్ళకూ ఫోన్ చేసి అడిగాడు. ఎవరింటికీ ఆవిడ వెళ్ళలేదని తెలుసుకున్నాడు.

లోపు భార్య దగ్గర నుండి ఫోన్.

ఏమండి...అత్తయ ఇంకా ఇంటికి రాలేదు. భయంగా ఉందండి  అని చెప్పటంతో ప్రవీణ్ కుమార్ కి ధడ మొదలయ్యింది.

గుడిలో ఉన్న అరుగు మీద కూర్చుండిపోయాడు. తల్లి ఇంకెక్కడికి వెళ్ళుంటుందో ఎంత ఆలొచించినా అతనికి జవాబు దొరకలేదు.

చాలా సేపు ఆలోచించి, ఆలోచించి అలసిపోయి, నీరసించిన ప్రవీణ్ కుమార్ నిరాశతో ఇంటిదారి పట్టాడు.

ఇంటికి వెళ్ళిన వెంటనే కనీళ్ళతో ఎదురైన భార్య “ఏమండీ నాకు చాలా భయంగా ఉందండి...ఎక్కడికి వెళ్ళినా మనతో చెప్పే కదా వెళ్తుంది అత్తయ్య”  అన్నది.

తొమ్మిదో క్లాసు చదువుతున్న మనుమరాలు కూడా..."బామ్మను చూడకుండా నేను స్కూలుకి వెళ్ళను" అని మారం చేసింది.

తల్లి గుడికి వెళ్ళి ఎంత సమయం అయ్యిందో నని గడియారం వైపు చూస్తున్న ప్రతిసారి తన ఆఫీసులో రోజు ముఖా ముఖి ఇంటర్ వ్యూలు ఉన్నాయంటూ ప్రవీణ్ కుమార్ కు గుర్తు చేస్తోంది గడియారం.

ఏదైనా ప్రమాదంలో ఉన్నదా? పోలీసుకు వెడదామా? బయట ఇది ఒక న్యూస్ అయిపోతుందేమో? పలురకాల ఆలొచనలతో సతమతమవుతున్నప్పుడు లాండ్ లైన్ ఫోన్ మోగింది.

పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫోన్ రిసీవర్ అందుకుంది కోడలు.

"ఏమండి....హాస్పిటల్ నుండి ఫోన్ . అత్తయ్య రోడ్డుమీద కళ్ళుతిరిగి పడిపోయారట...."

కాస్త రిలీఫ్ పొందిన వాళ్ళు, హాస్పిటల్ కు పెరిగెత్తారు.

దెబ్బలేమీ తగలని నారాయణమ్మ, కొడుకు రావడాన్ని గమనించి, కను సైగ చేసి దగ్గరకు రమ్మన్నది.

దగ్గరకు వచ్చిన కొడుకుకి, తన చూపుడు వేలితో ఒక యువకుడిని చూపించి " రోడ్డుమీద నడుస్తుంటే సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయాను. అదిగో కుర్రాడు మాత్రం టైముకు వచ్చి సహాయం చేయకపోతే ...నన్ను ప్రాణాలతో చూసుండేవాడివి కాదు....."

తల్లి చూపించిన కుర్రాడి వైపు క్రుతజ్ఞతా భావంతో చూశాడు ప్రవీణ్ కుమార్.

కాసేపు హాస్పిటల్లో ఉన్న తరువాత తల్లిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు.

తల్లిని ఇంటి దగ్గర దింపి హడావిడిగా ఆఫీసుకు వెళ్ళిన ప్రవీణ్ కుమార్ కు, తన తల్లిని కాపాడిన యువకుడు ఇంటర్ వ్యూ క్యాండిడేట్స్ తో ఉండటం చూశాడు.

తల్లిని దైవంగా భావించే ప్రవీణ్ కుమార్, తల్లి వేలు చూపి తనను కాపడిన వ్యక్తి అతనే అని చూపించినప్పుడు, వ్యక్తిని దైవం చూపిన వ్యక్తిగా బావించాడు.

అలా భగవంతుడు చూపిన క్యాండిడేట్ గా విక్రమ్, ఎం.డి ప్రవీణ్ కుమార్ మనసులో చోటు చేసుకున్నాడు.

                                                                    ***********************************

మరుసటిరోజు ప్రొద్దున ఆరుగంటలు.

కొడుకు ఎంత చెప్పినా వినకుండా ప్రతి రోజూ అలవాటుగా పెట్టుకున్న గుడి కార్యక్రమాన్ని మార్చుకోవడం ఇష్టం లేక గుడికి బయలుదేరింది నారాయణమ్మ.

"ఏమ్మా...నిన్ననే కదా హాస్పిటల్లో ఉండి వచ్చావు....ఒక వారం రోజులు రెస్ట్ తీసుకోకూడదా?"

నాకేమీ లేదురా? నేను బాగానే ఉన్నాను...నిన్ననే కదా నాకంతా బాగానే ఉన్నదని డాక్టర్లు చెప్పారు"

తల్లిని ఏమీ అనలేక "సరే...జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా" అన్నాడు ప్రవీణ్ కుమార్.

నారాయణమ్మ గుడికి బయలుదేరింది.

గుడిలోకి వచ్చిన నారాయణమ్మను చూసిన వెంటనే ఆమెకోసమే గుడిలో కాచుకోనున్న విక్రమ్ చేతులెత్తి ఆమెకు నమస్కరించాడు.

దేవుల్లందరూ నన్ను పట్టించుకోకపోయినా, మీరు మాత్రం మా ఇంటి ఇలవేల్పు దైవంలాగా వచ్చి నన్ను పట్టించుకున్నారు. మీ దయతో నాకు ఉద్యోగం దొరికింది. మిగిలినవాళ్ళకు ఎలాగో నాకు తెలియదు గానీ నాకు మాత్రం గుడిలో కనిపించే దైవం మీరేనమ్మా"

గుడిలో నిలబడి అలా మాట్లాడకూడదు బాబూ. గుడిలోకి వచ్చిన తరువాత అదిగో దేవుళ్ళకు తప్ప మరెవరికీ చేతులెత్తి నమస్కరించకూడదు....మనిషికి మనిషి సహాయం చేసుకోకపోతే ఎందుకీ మనిషి జన్మ? ఉద్యోగం దొరకటం నీ అద్రుష్టంగా భావించుకో...నీ తెలివితేటలను పెంచుకో" చెప్పింది నారాయణమ్మ.

ఆవిడ కాళ్ళకు నమస్కరించబోయిన అతన్ని వారించి ఆఫీసుకు టైము అవుతుంది... దేవుడిని దర్శించుకుని బయలుదేరు" అని చెప్పి వెళ్ళిపోయింది.

రెండు రోజులకు ముందు ఇదే గుడిలో నారాయణమ్మ కు ముందు నిలబడి చేతులెత్తి గుడిలో దేవుడిని మనసు కరిగేలా వేడుకున్నాడు ఇదే విక్రమ్.

దేవుడి మనసు కరిగిందో లేదో. నారాయణమ్మ మనసు కరిగింది.

అతను దేవునికి చేసిన ప్రార్ధనను విన్న నారాయణమ్మ మనసు చలించింది. జాలిపడింది.

వెంటనే అతని దగ్గరకు వెళ్ళి విచారించినప్పుడు, అతను ఉద్యోగం దొరక్క బాధపడుతున్నాడని తెలుసుకుంది.

తండ్రి చనిపోయాడు. కళ్ళు కనపడని తల్లి. పెళ్ళి వయసులో అక్కయ్య. వయసుకు వచ్చిన చెల్లి. ముగ్గురూ ఇతన్నే నమ్ముకుని ఉన్నారు.

అతనికి రోజు ఇంటర్ వ్యూ ఉన్నదని, అది తన కొడుకు కంపెనీలోనేనని తెలుసుకున్నది. నిజాయతీతో పెరిగిన తన కొడుకు ప్రవీణ్ కుమార్ కు రెకమండేషన్ అంటేనే గిట్టదు. తాను రెకమండ్ చేసినా కూడా తీసుకోడు.

ఎవరైనా సరే తమ అర్హతలకు తగ్గ ఉద్యోగం ఎక్కడ ఉందో వెతుక్కుని, దరఖాస్తు చేసుకుని, ఇంటర్ వ్యూలో తమ ప్రతిభను చూపి ఉద్యోగం సంపాదించుకోవాలి...అనే అభిప్రాయం కలిగినవాడు. ఇంటర్ వ్యూ లో అడిగే ప్రశ్నలకు తెలివిగా జవాబు చెబితేనే ఎవరినైనా పనిలోకి తీసుకుంటాడు.

ఇతనికి ఉద్యోగం చాలా అవసరం. బాగానే చదువుకున్నాడు. తన కొడుకు నడుపుతున్న కంపెనీలో ఉద్యోగానికి కావలసిన అర్హత కూడా ఉన్నది. అయినా కానీ ఒకవేల తను కొడుకు అడిగే ప్రశ్నలకు ఇతను తెలివైన జవాబులు చెప్పకపోతే, ఇతనికి ఉద్యోగం దొరకదు. అందుకని ఇతనికి ఉద్యోగం ఇప్పించటానికి ఏదైనా తంత్రము ఉపయోగించాల్సిందే అనుకుని నారాయణమ్మ వేసిన నాటకమే కళ్ళు తిరిగి పడిపోవటం, హాస్పిటల్లో చేరడం.

అనుకున్నది ఖచ్చితంగా జరిగినందుకు నారాయణమ్మ సంతోషపడింది.

నారాయణమ్మ దగ్గర సెలవుతీసుకుని వెనక్కి తిరిగి గుడి బయటకు వచ్చిన విక్రమ్ కు ఆశ్చర్యం ఎదురైయ్యింది.

అతని ముందు జుట్టు విరబోసుకుని మాసిపోయిన దుస్తులతో ఒక యువతి కళ్ళు తిరిగి పడిపోయింది.

ఏమీ అర్ధంకాని విక్రమ్, చూట్టూ ఒకసారి చూశాడు. ఎవరూ లేరు. ఒక విధమైన నిర్లక్ష్యంతో హడావిడిగా నడుస్తూ ఆమెను దాటి వెళ్ళాడు.

"నీళ్ళు...దాహం... ప్లీజ్ మంచినీళ్ళు" అని ఆమె అడుగుతున్నా పట్టించుకోకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు విక్రమ్.

                                                                    ***********************************

సరిగ్గా సమయం ప్రొద్దున తొమ్మిది గంటలు. టిప్-టప్ గా డ్రస్సు వేసుకుని ఆఫీసులోకి వెళ్ళాడు విక్రమ్. సహ ఉద్యోగులను పలకరించకుండా అక్కడున వైయిటింగ్ రూమ్ కుర్చీల దగ్గరకు వెళ్ళాడు.

"మీరు వచ్చిన వెంటనే మిమ్మల్ని ఎం.డి గారు లోపలకు రమ్మన్నారు" ఒక ఉద్యోగి చెప్పాడు.

అందరూ అతన్నే చూస్తుంటే, అతను మరింత రెచ్చిపోతూ ఒక విధమైన వెకిలి నవ్వుతో "వచ్చీ రాగానే నాకు ప్రమోషనా? రెకమండేషన్ అలాంటిది...భగవంతుడి రెకమండేషన్ " అన్న ధీమాతో ఏం.డి క్యాబిన్ దగ్గరకు వెళ్ళాడు. అద్దాల తలుపులను తెరిచి క్యాబిన్లోకి వెళ్ళాడు. అక్కడ చల్లదనంతో పాటు మంచి సువాసన కూడా వస్తోంది.

సారీ మిస్టర్ విక్రమ్.... మీకిక్కడ ఉద్యోగం లేదు. మామూలుగా ముఖాముఖి ఇంటర్ వ్యూ లో సెలెక్ట్ అయిన వాళ్ళను రోజే ఉద్యోగంలో జాయిన్ అవమని చెబుతాను. నిన్ను మాత్రం మరుసటిరోజు వచ్చి జాయిన్ అవమని చెప్పాను. నీ మొహం చూస్తే అందులో నాకు నిజాయతీ కనబడలేదు. అలా ఎందుకో అనిపించిందో నాకు అర్ధం కాలేదు. ఎందుకైనా మంచిదని నిన్ను మరునాడు వచ్చి జాయిన్ అవమన్నాను. నా ఆఫీసులో పనిచేస్తున్న ఎవరినడిగినా ఈమాటే చెబుతారు. అంతెందుకు నీతో పాటు సెలెక్ట్ అయిన మరొ ముగ్గురు రోజే నా ఆఫీసులో జాయిన్ అయ్యారు. విషయం నువ్వు తెలుసుకోలేకపోయావు.

మా అమ్మగారు నాదగ్గర ఇంతవరకు అబద్దం చెప్పలేదు. నీ జివితంకోసం ఇప్పుడు చెప్పారు. ఆమె చెప్పేది అబద్దం అని నాకు రోజే తెలుసు. ఎలా తెలిసింది అని ఆలొచిస్తున్నావా? మా ఆమ్మగారు చాలా ఆరొగ్యంగా ఉన్న మనిషి, ఆమె ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయిందో నాకైతే తెలియదు...

హాస్పిటల్ కు తీసుకు వచ్చినప్పుడు షీ ఈజ్ పర్ ఫెక్ట్ లీ ఆల్ రైట్...రెస్టుకోసం ఆమెను బెడ్ మీద పడుకోబెట్టాను. పడుకోమన్నాను, ఆమె నా చెయ్యి పుచ్చుకుని మా అబ్బాయికి చెప్పకండి, అనవసరమైన అదుర్దాకు గురౌతాడు. కాసేపాగి నేనే వెళ్ళిపోతాను అన్నది....అందుకే మీకు వెంటనే చెప్పలేదు. ఇప్పుడు మీరొచ్చి ఆడిగేంతదాకా ఆమె ఇంకా ఇక్కడే ఉన్నదని నాకు తెలియదు. అని డాక్టర్ నాతో చెప్పాడు.

మా అమ్మగారు నాకు ప్రత్యక్ష దైవం. ఆమె చెప్పిన మాటను అమలు చేయాలి. అందుకనే నీకు ఇంటర్ వ్యూ లేకుండా, నీ ప్రతిభ తెలుసుకోకుండా ఉద్యోగం ఇచ్చాను. నీ కష్టాలను తెలుసుకుని మానవతా దృక్పథంతో నీకు ఉద్యోగం ఇప్పించాలని, నా దగ్గరే నాటకమాడింది నా తల్లి.

సరె... కనీసం ఆవిడ ఆడిన అబద్దమైన నాటకానికి మీరు అర్హత కలిగిన వ్యక్తా, కాదా అని తెలుసుకోవటానికి చిన్న పరీక్ష పెట్టాను. అందులో మీరు ముఖా ముఖి ఫైల్ అయ్యారు. అందుకని మీకిక్కడ ఉద్యోగం లేదు. మీరు బయలుదేరవచ్చు" చెప్పాడు ఎం.డి ప్రవీణ్ కుమార్.

"పరీక్ష ఎప్పుడు పెట్టారు? అందులో నేను ఎలా ఫైల్ అయ్యాను?"...న్ ఫ్యూజ్ మైండ్ తో వేనక్కు తిరిగి శోకంతో బయటకు వచ్చిన విక్రమ్, ఏం.డి ప్రవీణ్ కుమార్ సెక్రెటరీ ని చూసి ఆశ్చర్యపోయాడు.

జుట్టు విరబోసుకుని మాసిపోయిన దుస్తులతోనీళ్ళు...దాహం... ప్లీజ్మంచినీళ్ళుఅంటూ ప్రాధేయపడుతూ గుడి దగ్గర కళ్ళుతిరిగి పడిపోయిన ఆమే ఈమె.

                                                                    ***********************************

"ఏమైందిరా?...ఎందుకంత డల్ గా ఉన్నావు? ఉద్యోగంలో జాయిన్ అవలేదా?" విక్రమ్ ను అడిగాడు అతను రూమ్ మేట్.

"లేదురా...నాకు ఉద్యోగం లేదని చెప్పారు. ఎంతో పక్కాగా నారాయణమ్మను నమ్మించి, ఆవిడ చేతే ఒక నాటకమాడించి ముఖాముఖి ఇంటర్ వ్యూ కి వెడితే, మొదట్లో నీకు ముఖాముఖి భగవంతుని రెకమండేషన్ ఉన్నదని చెప్పిన ఆయన నాకు పరీక్ష పెట్టటం, ముఖాముఖి నేను ఫైల్ అవటం....నేను నాటకమాడానని అయనకెలా తెలిసిందో"

"సింపిల్ రా... నువ్వు నమ్మించి మోసగించింది నారాయణమ్మను కాదు...ముఖాముఖి భగవంతుడినే. అందుకే పూర్తి ఆరొగ్యంతో ఉన్న తన తల్లి కళ్ళుతిరిగి పడిపోవడం, హాస్పిటల్లో ఆమె ఆరొగ్యం చాలా బాగున్నదని చెప్పటం ప్రవీణ్ కుమార్ గారిని ఆలొచింప చేసుంటుంది. తల్లి అడిన అబద్దమైన నాటకాన్ని నిజం చేయాలని, కనీసం ఆవిడకున్న మానవతా దృక్పథం నీలో ఉన్నదో, లేదా తెలుసుకోవటానికి అయన రోజు నీకు పరీక్ష పెట్టాడు. అందులో నువ్వు ఫైల్ అయ్యావు"

ఉద్యోగాలు సంపాదించటానికి చదువు మాత్రమే చాలదు. పెద్ద పెద్ద ఉద్యోగాలకి ధరఖాస్తు చేసుకోవటానికి మాత్రమే చదువు ఉపయోగపడుతుంది.

ఎవరైనా సరే తమ అర్హతలకు తగ్గ ఉద్యోగం ఎక్కడ ఉందో వెతుక్కుని, దరఖాస్తు చేసుకుని, ఇంటర్ వ్యూలో తమ ప్రతిభను చూపి ఉద్యోగం సంపాదించుకోవాలి...అనే అభిప్రాయం కలిగినవాడు ప్రవీణ్ కుమార్ గారు. ఇంటర్ వ్యూ లో అడిగే ప్రశ్నలకు తెలివిగా జవాబు చెబితే చాలదు, ఉద్యోగానికి కావలసిన అర్హతలు ఉన్నా క్యాండిడేట్ కు కనీస మానవత్వ విలువలు ఉంటేనే ఆయన ఉద్యోగం ఇస్తాడు….. ఆయన గురించి నీకొక ఉదాహరణ చెబుతా విను.

ఆయన కంపెనీలో పనిచేస్తున్న ఒకతన్ని ఉద్యోగంలోకి తీసుకునేటప్పుడు ఆయన ఆడిగిన ప్రశ్న ఏమిటో తెలుసా? …..'అన్యాయం, అధర్మం, అవినీతి, దొంగతనం, దోపిడి, మోసం, దౌర్జన్యం, మాట తప్పడం, అబద్ధం' మాటలు ఉపయోగించి 'ఎదుటి వ్యక్తి డబ్బులు మన ముందే కింద పడినా' అనే ఆంశం మీద మానవత్వపు విలువల మీద ఒక వ్యాసం రాయమన్నాడట. ఒక గంట తరువాత క్యాండిడేట్ రాసిచిన్న వ్యాసం ఏమిటో తెలుసా...

ఎదుటి వ్యక్తి డబ్బులు మన ముందే కింద పడినా, అవి మనవి అనడం అన్యాయం, తిరిగి ఇవ్వక పోవడం అధర్మం ,అదే డబ్బు అతని అవసరం నెరవేర్చడానికి చట్టవిరుద్ధంగా తీసుకుంటే అవినీతి ,అతనికి తెలియకుండా తీసుకోవడం దొంగతనం ,అతన్ని కొట్టి లాక్కోవడం దోపిడి ,అప్పుగా తీసుకొని చెల్లించకపోవడం మోసం ,తీసుకుని తీసుకోలేదని బొంకడం దౌర్జన్యం, ఇస్తానన్న సమయానికి ఇవ్వక పోవడం మాట తప్పడం ,నీ దగ్గర డబ్బులు ఉన్నా కూడా లేవు అని చెప్పడం అబద్ధం

దీన్నే రోజుల్లో గ్రూప్ 'డిస్ కషన్ అని పెట్టి క్యాండిడేట్లను అంచనా వేస్తున్నారు

" నీ కంటే ముందు త్వరగా ఉద్యోగం సంపాదించేనని మురిసిపోయాను..."

ఇప్పుడైనా నేను చెప్పింది వినరా...నీ చదువుకు తగినట్లు నీ ప్రతిభను పెంచుకో. నాలెడ్జీ పెంచుకో. రెండూనే ఒక మనిషి జీవితాన్ని నిర్ణయిస్తాయి. ప్రతి ఒక్కరిలో ప్రతిభ ఉంటుంది అది రంగంలో అయినా కావచ్చు. చాలా మంది తమలో ఉన్న ప్రతిభను గుర్తించక ఇబ్బంది పడుతుంటారు. ప్రతిభను గుర్తించి రంగంలో కృషి చేస్తే ఉన్నత శిఖరాలను అందుకోవచ్చు.”

అర్ధమైందిరాఅంటూ మొదటిసారిగా ఆరోజు పేపర్ను చేతిలోకి తీసుకున్నాడు విక్రమ్.

************************************************సమాప్తం*****************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చిలుకల గుంపు...(కథ)

దుబాయి వాడి పెళ్ళాం…(కథ)

ఆకలికి రంగులేదు…(కథ)