మాతృత్వం...(కథ)

 

                                                                       మాతృత్వం                                                                                                                                                     (కథ)

రోజు కోర్టులో జడ్జిమెంట్ డే.

జడ్జిమెంట్ వినడానికి పత్రికా విలేఖరులతో సహా మామూలు జనం కూడా పోగయ్యేరు.

కోర్టు హాలు ఇంతకుముందెప్పుడూ అంతమంది జనంతో నిండలేదు. రోజు కోర్టులో ప్రముఖ రాజకీయ నాయకుడిదో లేక ప్రముఖ సెలెబ్రెటీ కి చెందిన కేసులోనో జడ్జిమెంట్ ఇవ్వటంలేదు.

మరి అక్కడ అంతమంది జనం ఎందుకు గుమికూడున్నారో నన్న ప్రశ్న మీకనిపించవచ్చు. దానికో ముఖ్య కారణం ఉన్నది. కోర్టులో రోజు అత్యంత విన్నూతమైన, కొత్తరకం కేసుకు సంబంధించిన జడ్జిమెంట్ ఇవ్వబడుతోంది. జడ్జిమెంట్ ఎలా ఉంటుందో తెలుసుకోవలన్న ఆత్రుత, ఇంట్రస్టే అక్కడ అంతమంది జనం పోగవడానికి అసలు కారణం.

"జరగండి...జరగండి" ...ఇద్దరు పోలీసులు గుంపును పక్కకు జరుపుతుంటే నిండు గర్భిణి అర్చన ఒక చేతిని నడుం మీద మరొక చేతిని తన స్నేహితురాలు గౌరి భుజం మీద వేసుకుని నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ కోర్టు హాలులోకి వచ్చి అక్కడున్న బెంచి మీద కూర్చుంది. పక్కనే ఆమె భర్త కిషోర్ కూర్చున్నాడు. కిషోర్ పక్కన అతని ప్రాణ స్నేహితుడు వెంకట్ కూర్చున్నాడు. అతని పక్కన అతని భార్య గౌరి కూర్చుంది.

వీరు నలుగురూ కలిసిరావటం, పక్కపక్కనే కూర్చోవడం చూసి అక్కడ గుమికూడిన జనం ఆశ్చర్యపోయేరు. ఎందుకంటే కోర్టులో ఆరోపణ పిటిషన్ వేసి న్యాయం కోసం పోరాడుతున్నది ఇద్దరు దంపతులే. ఎప్పుడు కోర్టుకు వచ్చినా వేరు వేరుగా వచ్చి, వేరు వేరు చోట్లలో కూర్చునే రెండు జంటలూ రోజు కోర్టుకు కలిసి రావడం, పక్క పక్కన కూర్చోవడం అక్కడ గుమికూడిన జనాన్ని ఆశ్చర్యానికి లోను చేసింది.

"ఇదేమిటి!...ఎప్పుడూ పిల్లి-ఏలుకల్లా దూర దూరంగా ఉండే వీళ్ళు రోజు ఒకరి భుజం మీద ఒకరు చేయివేసుకుని కలిసి వచ్చేరు...పకపక్కనే కూర్చున్నారు" గుమికూడిన జనంలో ఎవరో తమ ఆశ్చర్యాన్ని గట్టిగా అందరికీ వినబడేలా వెలిబుచ్చేరు.

అక్కడ గుమికూడిన జనం విషయం గురించే చర్చించుకుంటున్నారు. వారి మాటలు కోర్టు హాలును మార్కెట్టులా మార్చింది.

ఇంతలో "సైలన్స్" అన్న కేక వినబడింది.

ఒక్కసారిగా కోర్టు హాలులో నిశ్శబ్ధం చోటు చేసుకుంది.

కోర్టు హాలులోకి ప్రవేశించేరు జడ్జి.

కూర్చున్నవారందరూ లేచి నిలబడ్డారు...జడ్జి తన సీటులో కూర్చుంటూ అందరినీ కూర్చోమన్నారు.

గుమాస్తా జడ్జికి ఒక కేసు కట్టను అందించేడు.

కేసు కట్టను తీసుకున్న జడ్జి అందులోని పేజీలను ఒక సారి తిరగేసి కేసు కట్టను తన టేబుల్ మీద ఉంచుతూ "గౌరీ వాసస్ అర్చన ఆరోపణ కేసులో జడ్జిమెంట్ ఇవ్వబోయే ముందు...చివరి సారిగా కోర్టుకు ఏమైనా చెప్పదలచుకుంటే చెప్పుకోవచ్చు" అన్నారు.

వెంటనే గౌరి తరఫు వాదనను సమర్ధించే లాయర్ లేచి నిలబడి "ఎస్...యువర్ ఆనర్" అని గౌరవంగా అన్నాడు.

"ప్రొసీడ్" అన్నారు జడ్జి.

"యువరానర్... కేసులో మీరు జడ్జిమెంట్ ఇవ్వవలసిన అవసరంలేదు. ఎందుకంటే గౌరి-అర్చనలు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్ మెంట్ చేసుకున్నారు. నా క్లయంట్ గౌరి తన ఆరోపణను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు...మా రిక్వెస్టును మీరు దయచేసి అంగీకరించాలని కోరుతున్నాను" అంటూ ఒక కవరును జడ్జికి అందించేడు.

ఒక్క నిమిషం తన ఆశ్చర్యాన్ని వెలిబుచ్చిన జడ్జి కవరు తీసుకుని, కవరులో ఉన్న కాగితాన్ని తీసి అందులో రాసున్న విషయాలను చదివి ఆశ్చర్యం, సంతోషం కలిగిన ముఖంతో "మీరేమంటారు" అర్చన తరఫు లాయర్ను అడిగేరు.

"నో అబ్జెక్షన్ యువరానర్... కవర్లో రాసున్న విషయాలన్నీ గౌరీ-అర్చనలు ఒకటిగా చెప్పినవే...అందులో ఇద్దరూ సంతకాలు చేసేరు. దయచేసి దాన్ని మీరు అంగీకరించి కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు మమ్మల్ని, గౌరి-అర్చనలను క్షమించవలసినదిగా కోరుతూ కేసును ఇంతటితో ముగించవలసినదిగా కోరుతున్నాను" అర్చన తరఫు లాయర్ తలవంచి కోర్టును గౌరవించేడు.

"ఇట్స్ ఆల్ రైట్...మీరందరూ దీనికి అంత బాధ పడవలసిన అవసరంలేదు. కవరులోని విషయాలు చదివిన తరువాత నాకూ చాలా సంతోషం కలిగింది. అసలు ఇలాంటి కేసులు కోర్టుకు రాకూడదు. ఎందుకంటే ఇలాంటి కేసులలో జడ్జిమెంట్ ఇవ్వడం చాలా కష్టం. కష్టం నుండి కోర్టును గౌరి-అర్చనలు బయటపడేసేరు....దిస్ కేస్ ఈస్ డిస్మిస్సుడ్ అండర్ మ్యూచువల్ అండర్ స్టాండింగ్ అండ్ కన్సెంట్ ఆఫ్ బోత్ పెటీషనర్ అండ్ రెస్పాండంట్" అని చెప్పి కేసు కట్టపై పెద్ద ఇంటు మార్క్ వేసి సంతకం పెడుతూ " కోర్ట్ ఈస్ అడ్జరండ్" అని చెప్పి వెళ్ళిపోయేరు.

వెంటనే కోర్టు హాలంతా గుస గుసల శబ్ధంతో మోగిపోయింది. జడ్జిమెంట్ ఎలా ఉంటుదో తెలుసుకోవాలనుకుని వచ్చినవారందరూ నిరాశపడ్డారు.

"కవరులో ఏం రాసేరు...ఎలా ఇద్దరూ ఒకటయ్యేరు" అని పత్రికా విలేఖర్లు గౌరి-అర్చనలను ప్రశ్నలతో ముంచెత్తేరు. వారి తరఫున వాదించిన లాయర్లను వేధించేరు.

"అది గౌరి-అర్చనల ప్రైవసీకి సంభందించినవి. అవి మేము బయట పెట్టకూడదు" అంటూ లాయర్లు సమాధానం ఇస్తూంటే పోలీసుల బందోబస్తుతో గౌరి-అర్చన దంపతులు కోర్టు బయటకు వచ్చి అక్కడున్న గౌరి వాళ్ళ కారులో కూర్చున్నారు.

కారు వేగంగా కోర్టు బయటకు వెళ్లిపోయింది.

                                                                         ***********************************

కడుపులో సీతాకోకచిలుకలు ఎగురుతున్నట్లు అనిపించడంతో భావోద్వేగానికి గురి అయిన అర్చన తాను పడుకున్న మంచం నుండి క్రిందకు దిగి తన పొత్తి కడుపును తడిమి చూసుకుని ఆనందపడింది.

ఎదురుగా ఉన్న బీరువా తలుపుకు ఉన్న అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. "గర్భం దాల్చి ఐదు నెలలు కూడా పూర్తిగా నిండలేదు...అప్పుడే పొట్ట పెద్దదిగా ఎందుకు కనబడుతుంది"...తనలో తానే అనుకుంటున్న అర్చన కడుపులో ఏర్పడిన చిన చిన్న కదలికలకు మరింత ఆనంద పడింది.

ఇదేమీ ఆమెకు కొత్త కాదు. ఎందుకంటే అంతకు ముందు అర్చన ఒక బిడ్డను కన్నది. అప్పుడు కూడా బిడ్డ కదలికల అనుభూతి ఆమెలో ఆనందం ఏర్పరచింది. ఎంతమంది బిడ్డలను కన్నా ప్రతి తల్లీ గర్భం దాల్చినప్పుడల్లా కడుపులోని బిడ్డ కదలికలు ఎప్పటికప్పుడు కొత్త అనుభూతిని, ఆనందాన్ని ఏర్పరుస్తాయి. అలాంటి ఆనందమే అర్చనలొ ఇప్పుడు చోటుచేసుకుంది.

కానీ ఆనందాన్ని అర్చన ఎక్కువసేపు అనుభవించలేకపోయింది. కారణం అర్చన గర్భంలో ఉండే బిడ్డ అర్చన బిడ్డ కాదు. పది నెలలు బిడ్డను మోసి బిడ్డను కన్న తరువాత బిడ్డను గౌరికి ఇచ్చేయాలి. ఆమె ఆనందానికి అడ్డుకట్ట వేసేది, ఆమెను నీరసానికి గురిచేసేది ఆలొచనే.

మెల్లగా వెళ్ళి మళ్ళీ మంచం మీద పడుకుంది అర్చన.

మొదటిసారి గర్భం దాల్చినప్పుడు "ఇది నా బిడ్డ! నా పోలికలతోనో లేక నా భర్త పోలికలతోనో బిడ్డ పుడుతుంది. నాలాగా తెలుపుగా పుడుతుందా? లేక ఆయనలాగా చామన చాయ రంగులో

పుడుతుందా?...మా ఇద్దరిలో ఎవరో ఒకరి పోలికలతో, ఏదో ఒక రంగుతో పుడుతుంది. ఎలా ఉన్నా సరే...పరవలేదు" అనే ఆలోచనలతో ఎంతో ఆనందపడేది.

కానీ సారి..."బిడ్డకు తండ్రి నా భర్త కదే? తల్లి నేను కాదే? కడుపులో బిడ్డ రూపం దాల్చినప్పటి నుండి బిడ్డను పది నెలలు మోయడం, ప్రశవ నొప్పులు అనుభవించి బిడ్డను కనబోయేదెమో నేనే...నేను తినే బలమైన ఆహారాన్ని బొడ్డుపేగు మూలంగా అందుకుని బలంగా, ఆరొగ్యంగా పెరుగుతున్నది నా బిడ్డ కాదే...బిడ్డ పుట్టిన వెంటనే బిడ్డకూ, నాకూ ఉన్న బంధం తెగిపోతుందే...పది నెలల బంధానికి ముగింపు చుక్క పెట్టేస్తారే...పుట్టిన బిడ్డను కనులారా చూసుకుని, బిడ్డను పువ్వులాగా మెల్లగా చేతుల్లోకి తీసుకుని, చిన్నగా ముద్దుపెట్టుకుని, హృదయానికి హత్తుకుని ప్రేమతో తల్లి పాలు ఇవ్వలేనే" అన్న ఆలొచనలతో కడుపులో బిడ్డ పెడుతున్న తుంటరి కదలికలకు అర్చన ఆనందపడలేకపోతోంది.

ఒక అగ్రీమెంట్ మూలంగానే పది నెలల బంధం అర్చనకు ఏర్పడింది. దాని ప్రకారం బిడ్డను కన్న వెంటనే... బిడ్డను గౌరి-వెంకట్ దంపతులకు అప్పగించేయాలి. "బిడ్డను పది నెలలు మోసింది, నొప్పులతో కనింది నేనే" అన్న మాటను అర్చన అక్కడితో మర్చిపోవాలి. బాధే అర్చన మనసును అనుక్షణం వేధిస్తున్నది. కానీ తప్పదు. అగ్రీమెంటుకు కట్టుపడాలి. అసలు అగ్రీమెంట్ సలహా గౌరి-వెంకట్ దంపతులకు ఇచ్చింది అర్చనే.

                                                                           ***********************************

వెంకట్, అర్చనకు తెలియని వ్యక్తి కాదు. వెంకట్ అర్చన భర్త కిషోర్ కి ప్రాణ స్నేహితుడు. చిన్నప్పటి నుండి కిషోర్-వెంకట్ ఇద్దరూ కలిసి చదువుకున్నారు.

కిషోర్ బుర్రకు చదువు సరిగ్గా ఎక్కలేదు. పదో తరగతితోనే చదువుకు సెలవు చెప్పేడు. వెంకట్ పెద్ద చదువులు చదివి, పెద్ద పదవితో ఉద్యోగం చేస్తున్నాడు.

వెంకట్ అతని కంపెనీలోనే, అతనికి సరిసమంగా చదివి, అతనిలాగే పెద్ద పదవిలో ఉన్న గౌరిని అప్పుడప్పుడూ కలుస్తూ, చివరికి అమెనే ప్రేమ వివాహం చేసుకున్నాడు.

ఆఫీసుకు వెళ్ళడానికి కారు, బ్రహ్మాండమైన ఇల్లు, పనివాళ్లు లాంటి వసతులతో దర్జాగా జీవితం గడుపుతున్న వెంకట్ తన బాల్య స్నేహుతుడైన కిషోర్ని ఏనాడు మర్చిపోలేదు. నెలకి రెండు మూడు సార్లు భార్య గౌరితో కలిసి కారులో కిషోర్ ఇంటికి వెళ్లి ఒక రోజంతా గడిపి వస్తాడు...కొషోర్ ఇంట్లో నేల మీద కూర్చుని, విస్తరాకులో అర్చన వడ్డించే భోజనాన్ని హక్కుతో కడుపు నిండుగా తిని, చీకటిపడే సమయానికి తన ఇంటికి తిరిగి రావడం వెంకట్ కు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

ఎనిమిదేళ్ళు గడిచినా వెంకట్-గౌరి దంపతులకు సంతాన భాగ్యం కలగలేదు. ఎంతో అన్యోన్యంగా దాంపత్య జీవితం గడుపుతున్న దంపతులకు పిల్లలు పుట్టలేదనే బాధ ఉండేది కాదు.

రోజులు గడుస్తున్న కొద్దీ ఆఫీసులోనూ...పెళ్లిల్లు, బర్త్ డే ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కుళ్ళు మనసున్న కొందరు కావాలనే పిల్లలు లేరనే విషయాన్ని గౌరికి ఎత్తి చూపే వారు. గుస గుస లాడుకుంటూ గౌరి మనసును గాయపరిచేవారు.

"ఏం సమాజమండీ ఇది! అవతలివారి అంతరంగిక విషయాలలో కలుగజేసుకోవడానికి వీళ్ళకు హక్కు ఎవరిచ్చేరు?...మీకు నేను బిడ్డను, నాకు మీరు బిడ్డ అనుకుని జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న మన గురించి వీళ్ళకెందుకో? మనకు పిల్లలు పుట్టకపోతే వారికెందుకంత బాధ?....వాళ్ళకోసమైనా, వాళ్ళ నోరు మూయించటానికైనా మనం బిడ్డను కనాలి...వెంటనే మనం డాక్టర్ను కలిసి ఆలోచన తీసుకుని ట్రీట్ మెంట్ తీసుకుందాం" కళ్ళ నుండి కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ భర్త కిషోర్తో చెప్పింది గౌరి.

గౌరి-వెంకట్ దంపతులు మరునాడే డాక్టర్ను కలిసేరు.

"మిస్టర్ వెంకట్! మీలో ఏలోపమూ లేదు...మీ భార్య గర్భ సంచీ చాలా బలహీనంగా ఉంది. పిండాన్ని మోసే బలం ఆమె గర్భ సంచీకి లేదు. మీకు తెలియకుండానే రెండు-మూడు సార్లు అబార్షన్ అయ్యుంటుంది" చెప్పేడు డాక్టర్.

మాట వినగానే గౌరికి ఏడుపు ముంచుకొచ్చింది..."డాక్టర్! నేను తల్లినే అవలేనా? చివరిదాకా గొడ్రాలు అనే పిలుపుతో, దుఃఖంతో చచ్చిపోవాలా?" గౌరి నిరాశతో అడిగింది.

"నిరాశపడకమ్మా! నువ్వు తల్లి అవటానికి ఒకే ఒక మార్గముందమ్మా...మీ అండాన్ని, మీ భర్త వీర్యకణాలతో ఫలదీకరించి... పిండాన్ని మరో స్త్రీ గర్భంలో ప్రవేశపెట్టే పద్దతి ద్వారా నువ్వు బిడ్డను పొందగలవు. ఒక్క మాటలో చెప్పాలంటే సరోగసీ ద్వారా, అంటే అద్దె తల్లి మూలం నువ్వు తల్లివి కావచ్చు" వివరించి చెప్పేడు డాక్టర్ .

గౌరి మొహంలో ఉత్సాహాం పొంగుకు వచ్చింది..."డాక్టర్! మేమిద్దరం లక్షలు సంపాదిస్తున్నాము. ఎంత ఖర్చు అయినా పరవాలేదు. మాకు బిడ్డ పుడితే చాలు...అద్దె తల్లికి వెంటనే ఏర్పాటు చేయండి" చెప్పింది గౌరి.

"మంచి అద్దె తెల్లి దొరికిన వెంటనే కబురు చేస్తాను ...మీరు సంతోషంగా వెళ్ళి రండి" చెప్పేడు డాక్టర్.

గౌరి-వెంకట్ దంపతులు ఆనందంగా అక్కడి నుండి బయలుదేరేరు.

                                                                       ***********************************

ఆదివారం స్నేహితుడింటికి వెళ్ళిన గౌరి-వెంకట్ దంపతులు విషయాన్ని అర్చన-కిషోర్లకు చెప్పేరు.

అర్చనకు ఆలొచన వచ్చింది.

"గౌరీ! ఎందుకు ఎవరికోసమో కాచుకోవటం...అద్దె తల్లిగా ఉండి, మీకు బిడ్డను కని ఇచ్చేందుకు నేను రెడిగా ఉన్నాను! వెంటనే డాక్టర్ దగ్గర చెప్పి ఏర్పాట్లు చేయండి"

గౌరి-వెంకట్ దంపతులు ఆనందం పట్టలేకపోయేరు.

అర్చన మాటలకు ఆశ్ఛర్యపోయిన ఆమె భర్త కిషోర్, భార్య దగ్గరగా వచ్చి, ఆమె భుజం తట్టి "శభాష్" అంటూ అర్చనను అభినందించేడు.

ఏర్పాట్లు జరిగినై.

                                                                       ***********************************

ఐదు నెలలు గడిచిపోయేయి.

మూడు రోజులకొకసారి అర్చన ఇంటికి వచ్చి వెళ్ళే గౌరి-వెంకట్ దంపతులు వారం రోజులుగా అర్చన ఇంటికి రాలేదు. కనీసం ఫోను కూడా చేయలేదు. అర్చనే వాళ్ళకు ఫోను చేస్తోంది. కానీ ఇద్దరి ఫోన్లు బిజీ అని చెబుతున్నాయి.

ఐదు నెలలు గడిచిపోయేయి. అర్చనకు కడుపులో బిడ్డ కదలికలు తెలుస్తున్నాయి. మూడు రోజులకొకసారి అర్చన ఇంటికి వచ్చి వెళ్ళే గౌరి-వెంకట్ దంపతులు వారం రోజులుగా అర్చన ఇంటికి రాలేదు. కనీసం ఫోను కూడా చేయలేదు. అర్చనే వాళ్ళకు ఫోను చేస్తోంది. కానీ ఇద్దరి ఫోన్లు బిజీ అని చెబుతున్నాయి.

ఉండబట్టలేక రోజు రాత్రి అర్చన తన భర్తతో " ఏమండి...గౌరి బిడ్డ నా కడుపులో పడినప్పటి నుండి వాళిద్దరూ వారానికి రెండు-మూడు సార్లు మనింటికి వచ్చేవారు. ప్రతి రోజూ ఫోన్లు చేసి కష్ట సుఖాలు అడిగి తెలుసుకునే వాళ్ళు...ఎందుకనో పది రోజుల నుండి మనింటికీ రాలేదు, ఫోనూ చేయలేదు. నేను ఫోన్ చేస్తే ఇద్దరి ఫోన్లూ బిజీ అంటున్నాయి...మీకేమైనా ఫోను చేసేరా" భర్తను అడిగింది అర్చన.

"లేదు... ఫోన్ చెయ్యలేదు...బహుశ ఆఫీసు పనులతో బాగా బిజీగా ఉండుంటారు" అని కిషోర్ చెప్పిన మాటలు అమెకు త్రుప్తిని ఇవ్వలేదు.

రోజు రాత్రి గౌరి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఫోన్ చేసిన వెంటనే బిడ్డ కదలికలు ఎలా ఉన్నాయి, బలమైన ఆహారం తీసుకుంటున్నావా, మందులు వాడుతున్నావా...అని ఎన్నో ప్రశ్నలు వేసే గౌరి ఆరోజు అవేమి అడగలేదు.

"వెంకట్ కి-నాకు చిన్న మనస్పర్ధ. మొగవాడిననే అహంభావంతో పొగరెక్కి ఆడుతున్నాడు. భార్యంటే బానిస అనుకుంటున్నాడు. ఇక వెంకట్ తో కాపురం చెయ్యలేను...విడిపోవాలని నిర్ణయించుకున్నాం...డైవర్స్ కి అప్లై చేసేము బిడ్డ వద్దు అర్చనా! బిడ్డ పుడితే సమస్యలు ఎక్కువ అవుతాయి. బిడ్డ ఎవరి దగ్గర పెరగాలి అనే పోట్లాటతోనే జీవితం గడిచిపోతుంది...వెంకట్ నే వద్దనుకున్న తరువాత...వెంకట్ బిడ్డ మాత్రం ఎందుకు....అర్చనా బిడ్డను ఎలాగైనా తీయించేసుకో"

షాక్ తిన్న అర్చన" గౌరీ...నేను చెప్పేది విను. ఆవేశపడకుండా నిదానంగా ఆలొచించు. వెంకట్ బిడ్డ అని చెబుతున్నావే...ఏం... బిడ్డ నీది కాదా? నీ రక్తం కాదా? నీ గర్భ గుడ్డు నుండి అభివ్రుద్ది చెందిదే కదా? ప్రేమ నీకు లేకుండా పోయిందే...ఐదు నెలల తరువాత బిడ్డను ఎలా తీయించుకోను...పుట్టనీ గౌరీ... బిడ్డ పుడితే అదే మిమ్మల్ని కలుపుతుందని నమ్ముతున్నాను"

మమ్మల్ని కలుపుతుందని నువ్వే చెబుతున్నావు చూసేవా! అందుకే వద్దంటున్నాను. నాకు తెలిసిన ఒక లేడీ డాక్టర్ ఉన్నది...మూడు లక్షలు ఖర్చుపెడితే చాలు...ఐదు నెలల గర్భానైనా తీసి పారేసి పంపుతుంది. అక్కడికి వెళ్ళి తీయించుకుంటావా అర్చనా"

ఒక్క నిమిషం కూడా ఆలొచించ కుండా "వద్దు...మా సొంత ఊరు ఒక గ్రామమే కదా! అక్కడ ఒక మొరటు డాక్టరమ్మ ఉంది...ఇలాంటి వాటికి పేరుమోసిన డాక్టర్...ఆమె దగ్గరకు వెళ్ళి తీయించుకుంటాను" చెప్పింది అర్చన.

" గుడ్...అలాగే చేసేయ్. సహాయం కావాలన్నా మొహమాటపడకుండా నన్ను అడుగు...సరేనా" అని ఫోన్ కట్ చేసింది గౌరి.

అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన అర్చన భర్త "అర్చనా! వెంకట్ నాకు ఫోన్ చేసేడు. అన్ని విషయాలు నాకు చెప్పేడు...బిడ్డను తీయుంచుకోవడానికి, దాని తరువాత నీకు అయ్యే మందుల ఖర్చులకు కలిపి నా పేరు మీద మూడు లక్షల రూపాయలు నా బ్యాంకు ఖాతాలో వేసేడట..." అంటూ ఇంకా ఎదో చెప్పబోతుంటే అర్చన అడ్డుపడింది.

"ఆపండి... బిడ్డను నేను తీయించుకోను. బిడ్డను కూడా మన బిడ్డ అనుకుని పెంచుదాం. ఐదు నెలలు మోసినందువలన బిడ్డపై నాకు అభిమానం, ప్రేమ ఏర్పడింది. అయ్యో...పదో నెలలో బిడ్డ నుండి విడిపోవాలే అని బాధపడ్డాను...అయితే ఇప్పుడు వాళ్ళు బిడ్డను వద్దంటున్నారు. ప్రాణాలు తీయటం తప్పని అంత పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకు తెలియదేమో...ఐదు నెలలుగా బిడ్డను మోసేది నేను....ఇక మీదట బిడ్డ...." చెప్పలేక ఆగిపోయింది.

"ఇక మీదట బిడ్డ మన బిడ్డ! నీ ఇష్టాన్ని నేను కాదనను" అంటూ ఏడుస్తున్న తన భార్యను కిషోర్ దగ్గరకు తీసుకున్నాడు. అతని ఆప్యాయతకు అతని కౌగిలిలో వొదిగిపోయింది అర్చన.

                                                                 ***********************************

మరో నాలుగు నెలలు గడిచింది. కనే రోజులు దగ్గర పడటంతో అర్చన కాళ్ల వాపులతో బాధపడుతూ, నడవలేక నడుస్తోంది.

సెల్ ఫోన్ మోగింది. ఫోన్ తీసిన అర్చన "హలో" అన్నది.

"హలో అర్చనా! బాగున్నావా?...ఆరోజు నువ్వు చెప్పిన మాటలు నేను వినలేదు. వెంకట్ మీద కోపమూ, నాలోని అహంకారమూ కలిపి నన్ను మూర్ఖురాలిగా చేసి అలా నిర్ణయం తీసుకునేటట్లు చేసింది. స్నేహితులందరూ కలిసి వొత్తిడిచేస్తే మొన్ననే నేను-వెంకట్ ఇద్దరం కలిసి ఒక చోట కూర్చుని నిదానంగా మాట్లాడుకున్నాం. మాకేర్పడిన మనస్పర్ధలు ఒక్క సెకెండులో మాయమైపోయినై అంటే నమ్ము...డైవర్స్ వాపస్ తీసుకున్నాము. కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాం. అవసరపడి బిడ్డ వద్దని చెప్పేమే...అదెంత పెద్ద తప్పో ఇప్పుడు మాకు అర్ధమైయ్యింది"

"అవసరపడి మొగవాడు ఎన్ని నిర్ణయాలైనా తీసుకోవచ్చు. కానీ ఆడది నిదానంగా ఉండొద్దా! నిదానం నీకెందుకు లేకుండాపోయింది... మాతృత్వం పొందటం మనకు దేముడిచ్చిన వరం. అది నువ్వెలా గ్రహించలేకపోయేవు... ఫీలింగ్ నీలో ఎందుకు కలగలేదు. ఉర్లో అందరూ నిన్ను గొడ్రాలు అని చెబుతేనే నువ్వు తల్లినౌవుదామనుకున్నావా?....బిడ్డను తీయించేసుకో అని ఎంత ఈజీగా చెప్పేవో నీకు గుర్తుందా?... బిడ్డ నీ రక్తం పంచుకుని పెరుగుతున్న బిడ్డేనని నీకు తెలియదా? కడుపులో పెరుగుతున్న బిడ్డను బలవంతంగా తీయించుకోవటం హత్య చేసినంత నేరం...ఇప్పుడు కూడా స్నేహితులు వొత్తిడి చేస్తే కలిసి కాపురం చేద్దామనుకున్నురు కాని...ఇద్దరూ మీ తప్పులు తెలుసుకుని ఒకటౌదామనుకోలేదు. రక్త సంబంధమూ లేకపోయినా మాతృత్వం ఎంత గొప్పదో నాకు తెలుసు కాబట్టి మరో ఆడదాన్ని తల్లి చేయాలనే ఆశతో నీకు అద్దె తల్లిగా ఉండటానికి అంగీకరించేను. బిడ్డకు నేను అద్దే తల్లినే! కడుపులో పెరుగుతున్న బిడ్డను తీయించుకోవటం హత్యతో సమానమని నాకు తెలుసు కాబట్టి బిడ్డను నేను తీయించుకోలేదు."

"నిజమా అర్చనా! నేను ఎంత అద్రుష్టవంతురాలినో....." అంటూ మాట్లడబోతున్న గౌరితో…"ఆగు...నేనింకా ముగించలేదు. నేను చెప్పేది పూర్తిగా విను. ఇంకో వారం, పది రోజులలో బిడ్డ పుడుతుంది...అది మా బిడ్డ. బిడ్డను మేమే పెంచుకుంటాము. మీకు ఇవ్వను...ఎందుకంటే స్నేహితులు వొత్తిడిచేస్తే రోజు ఒకటిగా చేరిన మీరు రేపే విడిపోరని ఏమిటి గ్యారంటీ? తప్పూ చేయని బిడ్డ అప్పుడు అటు, ఇటూ తిరుగుతూ అల్లల్లాడిపోవాలా? …లేక అనాధశరణాలయంలోనైనా చేరుస్తారా?...ఎవరికి తెలుసు! వద్దు...అలాంటి పరిస్థితి నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు రాకుడదు. బిడ్డకు నేనే తల్లిని-తండ్రిని...ఇకమీదట విషయంగా నాతో మాట్లాడకు" అని చెప్పి ఫోన్ కట్ చేసింది అర్చన.

                                                                        ***********************************

తమ బిడ్డకొసం..."అర్చన కడుపులో పెరుగుతున్న బిడ్డ తమ బిడ్డే నని, అర్చన అద్దె తల్లి మాత్రమే నని, బిడ్డను కన్న వెంటనే మాకు బిడ్డను ఇచ్చేస్తానని అర్చన అగ్రీమెంట్ కూడా సంతకం చేసి ఇచ్చిందని, ఇప్పుడు బిడ్డని ఇవ్వనని చెబుతోందని...కాబట్టి అర్చన బిడ్డను కన్న వెంటనే మా బిడ్డను మాకు ఇప్పించమని"...కోర్టు సహాయం కొరుతూ కోర్టులో పెటీషన్ పెట్టుకున్నారు గౌరి-వెంకట్ దంపతులు.

                                                                         ***********************************

కేసు పూర్తి అవకుండానే, జడ్జిమెంటుకు ముందే గౌరి-అర్చనలు రాజీ పడ్డారు. ఎలా...ఎలా! ...ఏమని రాజీ పడుంటారు. అనే ప్రశ్న అందరి మదిలోనూ మెదులుతోంది. జడ్జిమెంటుకు ముందు జడ్జికి అందించిన కవరులో రాసున్నదేమిటి! జడ్జి కూడా దానికి ఒప్పుకున్నారే! కవరులోని కాగితంలో రాసున్నదేమిటో...మనం కూడా తెలుసుకుందాం.

"క్షమించు అర్చనా! నిన్ను మేము ఎంతో బాధ పెట్టేము. మాకోసం బిడ్డను మోస్తున్న నీ గురించి ఒక్క క్షణం కూడా ఆలొచించ కుండా పిచ్చి నిర్ణయాలు తీసుకుని, వాటిని నీ మీద రుద్దేము. నువ్వు తీసుకున్న నిర్ణయం చాల గొప్పదని మేము లేటుగా అర్ధంచేసుకున్నాము. మాతృత్వానికి నువ్విచ్చిన ప్రాముఖ్యత మమ్మల్ని సిగ్గుపడేట్లు చేసింది...ఇకమీదట మేము అవసరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోము. కారణంగానూ మాలో ఈగోకి చోటివ్వం. మేము ఎలాంటి ప్రామిస్ చేయమన్నా చేస్తాము. మేము అన్యోన్యంగా, సంతోషంగా కాపురం చేస్తున్నట్లు రోజైతే నీ మనసుకు అనిపిస్తుందో రోజు నువ్వు మా బిడ్డను మాకిస్తే చాలు. అంతవరకు నిన్ను మేము బలవంతం చేయం...అది ఎన్ని సంవత్సరాలైనా సరే కాచుకోనుంటాము...కానీ ఒక్కటి మాత్రం నువ్వు గ్రహిస్తే చాలు...నువన్నావే మాతృత్వం అని...అది ఇప్పుడు నాలో ప్రవాహంలా ప్రవహిస్తోంది...బిడ్డ కావాలని తహ తహ లాడిస్తోంది...అది నువ్వు నమ్మితే చాలు....ఇట్లు గౌరి-వెంట్

*****************************************************సమాప్తం***********************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దుబాయి వాడి పెళ్ళాం…(కథ)

చిలుకల గుంపు...(కథ)

స్పష్టత...(కథ)